అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిధుల బదలాయింపు నిర్ణయంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు,కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న బ్యాంక్ ఖాతాలను కొత్తగా నెలకొల్పిన కార్పొరేషన్ సర్విస్ కు బదలాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి.
ఎన్టీఆర్యూనివర్సిటీలో మంగళవారం ఉద్యోగులు , విద్యార్థి సంఘాలు జేఏసీగా ఏర్పడి నిరసన తెలిపారు. వీసీ, రిజిస్ట్రార్లకు వ్యతిరేకంగా వర్సిటీలో బైఠాయించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేపటి నుంచి విధులను బహిష్కరిస్తున్నట్లు జేఏసీ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వానికి బయట నుంచి అప్పులు పుట్టక సంస్థల నిధులను మళ్లించడం అన్యాయమని అన్నారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్కు వర్సిటీ పరిణామాలపై నివేదిస్తామని వారు వెల్లడించారు. మంత్రి సురేశ్ మాట్లాడుతూ వర్సిటీల్లో ఇబ్బందులుంటే ప్రభుత్వం నిధుల జోలికి వెళ్లదని వివరించారు.