KA Paul | ప్రజాశాంతి పార్టీకి ఎన్నికల కమిషన్ కొత్త గుర్తు కేటాయించింది. ఇన్నాళ్లు ఆ పార్టీకి హెలికాప్టర్ గుర్తు ఉండేది. కానీ రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి హెలికాప్టర్ గుర్తును కాకుండా.. మట్టికుండ గుర్తును కేటాయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్వయంగా వెల్లడించారు. విశాఖపట్నంలోని రైల్వే న్యూ కాలనీలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. మకు కుండ గుర్తు ఇచ్చిన ఈసీకి, ఆ గుర్తు ఇవ్వాలని ఆదేశించిన ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 10వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం తమకు కుండ గుర్తు కేటాయించిందని కేఏ పాల్ మీడియాకు వెల్లడించారు. స్వయంగా ఓ కుండను తయారుచేసుకుని మరీ ప్రెస్మీట్కు వచ్చి తన గుర్తును చూపించారు. ప్రతి ఒక్కరూ ఈ కుండ గుర్తును తమ మనసుల్లో నింపుకొని.. జీవితాలను మార్చుకోవాలని అన్నారు. శాంతి పాలన రావాలంటే.. కుండ పాలన రావాలని తెలిపారు. ఫ్యాన్కు ఉరివేసుకుని చాలామంది చనిపోయారని.. గ్లాసులు పగిలిపోయి చాలామందికి హాని జరిగిందని.. సైకిళ్లు యాక్సిడెంట్లు అయి వందల వేల మంది చనిపోయారని.. అదే కుండ తన మంచినీటితో కోట్ల మందికి ప్రాణాన్ని ఇచ్చిందంటూ.. రాజకీయ ప్రత్యర్థులపై సెటైర్లు వేశారు. తాను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని.. నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పిస్తామని అన్నారు.