అమరావతి : ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగి రెండు నెలలు కాకముందే విశాఖలో మరోసారి ఎన్నికల కోడ్ (Election code) ప్రారంభమయ్యింది. దాదాపు 36 రోజుల పాటు కోడ్ అమలులో ఉండనుంది. విశాఖపట్నం (Visakhapatnam) జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిన్న షెడ్యూల్ విడుదల చేసింది.
విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ(MLC) గా వైసీపీ (YCP) తరఫున పోటీ చేసిన గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ (Vamshikrishna Srinivas) గత ఎన్నికల్లో ఆయన జనసేన (Janasena) పార్టీ లో చేరారు. దీంతో వైసీపీ అధిష్టానం ఫిర్యాదుతో మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. దీంతో ఇక్కడ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. ఆ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని విశాఖపట్నం కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు.
ఆగస్టు 6న ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని, అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరణ, ఆగస్టు 13 వరకు నామినేషన్ల స్వీకరణకు ఆఖరు గడువు , 14న పరిశీలన, 16న ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని ఆయన వివరించారు. ఆగస్టు 30న ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఉపఎన్నిక, సెప్టెంబరు 3వ తేదీన ఓట్ల లెక్కింపు, సెప్టెంబరు 6న ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని అన్నారు.
ఉమ్మడి విశాఖపట్నం ఉమ్మడి జిల్లా పరిధిలోని విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ సభ్యులు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.