Earthqauke | ఏపీలో భూప్రకంపనలు భయాందోళనలు సృష్టించాయి. పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రత నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నిర్ధారించింది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో భూఉపరితలానికి 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించింది. తెల్లవారుజామున 2:33 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయని తెలిపింది.
ఈ భూకంప ప్రభావంతో పల్నాడు జిల్లాలోని వినుకొండతో పాటు దర్శి, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. అకస్మాత్తుగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే స్వల్ప ప్రకంపనల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. అయితే, రానున్న రోజుల్లో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.