అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ దృష్ట్యా అత్యవసర ప్రయాణాలకు రేపటి నుంచి ఈ-పాస్ విధానం అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ-పాస్ కోసం ప్రయాణికులు పోలీస్ సేవ అప్లికేషన్ సౌకర్యం వినియోగించుకోవాలని సూచించారు.
కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల వాహనాలను జప్తు చేస్తామని అన్నారు. అంతర్రాష్ట్ర రాకపోకలపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని, అంతవరకు కర్ఫ్యూ షరతులు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. కర్ఫ్యూ నిబంధనలపై ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు 144 సెక్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో రాజకీయ పార్టీల సభలు, ఎలాంటి సమావేశాలకు అనుమతి లేదని వెల్లడించారు. శుభకార్యాలు జరుపుకోవాలనుకునే వారు తప్పకుండా అధికారుల అనుమతి పొందాలని చెప్పారు. కర్ఫ్యూ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఎవరైనా కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే 100, 112 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని డీజీపీ కోరారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కరోనా కట్టడికి సహకరించాలని కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.