Srisailam | శ్రీశైలంలో దసరా మమోత్సవాలు ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలు అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. సంప్రదాయాన్ని అనుసరించి శాస్త్రోక్తంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు, అమ్మవారికి విశేష అలంకరణలు, ప్రత్యేక నవావరణ పూజలు, స్వామి అమ్మవార్లకు వాహనసేవలు, చండీహోమం, రుద్రహోమం, జపాపలు, పారాయణాలు జరిపించనున్నారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా ముందుగా ఈవో ఎం.శ్రీనివాసరావు దంపతులు, ఉభయ దేవాలయ ప్రధానార్చకులు, స్థానాచార్యులు, అర్చకస్వాములు, వేదపండితులు, అధికారులు ఆలయ ప్రవేశం చేశారు. సంప్రదాయబద్ధంగా పసుపు, కుంకుమలు, ఫలపుష్పాదులతో ఆలయ ప్రవేశం చేశారు. ఈ ఉత్సవాలకు నాందిగా ఉదయం 9 గంటలకు అమ్మవారి ఆలయ మండపంలో యాగశాల ప్రవేశం, గణపతి పూజ, దీక్షా సంకల్పం, కంకణపూజ, కంకణధారణ, రుత్విగ్వరణం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి యాగశాలలో అఖండదీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధనలు, చండీకలశస్థాపన, శ్రీచక్రార్చన, నవగ్రహజపాలు, చతుర్వేద పారాయణలు, చండీ సప్తశతి, మహావిద్యా పారాయణలు, సూర్యనమస్కారాలు జరిగాయి. అలాగే స్వామివారి యాగశాలలో యాగశాల ప్రవేశం, గణపతిపూజ, శివసంకల్పం, అఖండ దీపస్థాపన, వాస్తుపూజ, మండపారాధనలు, రుద్రకలశస్థాపన కార్యక్రమాలు జరిగాయి.
ఈ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా చేపడుతున్న నవదుర్గ అలంకారంలో భాగంగా ఈ సాయంకాలం శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని శైలపుత్రి స్వరూపంలో అలంకరించారు. ద్విభుజాలను కలిగిన ఈదేవి కుడిచేతిలో త్రిశూలాన్ని, ఎడమచేతిలో పద్మాన్ని ధరించి ఉంటుంది. నవదుర్గలలో ప్రథమ రూపమైన ఈదేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలగడంతో పాటు సర్వత్రా విజయాలు లభిస్తాయని చెబుతుంటారు. ముఖ్యంగా ఈ దేవీ ఆరాధన వలన కోరికలు సిద్ధిస్తాయని, ముత్తైదువులకు ఐదవతనం వృద్ధి చెందుతుందని అంటుంటారు. ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీస్వామిఅమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా ఇవాళ భృంగివాహనసేవ జరిపించారు. ఈ వాహనసేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి భృంగివాహనంపై వేంచేబు చేయించి పూజాదికాలు చేశారు.