అమరావతి : విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడి ఈవోకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రేపు(గురువారం) ఉదయం 10.30 గంటలకు స్వయంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడం వల్ల ఈవో భ్రమరాంబపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈవోగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తింపు ఇచ్చారు. తమ కంటే జూనియర్లను పర్మినెంట్ చేసిన ఈవో తీరుపై పలువురు తాత్కాలిక ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించినట్లుగానే తమను కూడా గుర్తించాలని వారు కోర్టుకు విన్నవించారు.
దీంతో హైకోర్టును ఆశ్రయించిన ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని న్యాయస్థానం గతంలో ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ఆమె పట్టించుకోకపోవడంతో తాత్కాలిక ఉద్యోగులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. వీరి అభ్యర్థనను పరిశీలించిన హైకోర్టు గురువారం దుర్గగుడి ఈవో స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.