శ్రీశైలం : కరోనా వైరస్ లక్షణాలు ప్రబలకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని భక్తులకు శ్రీశైల దేవస్థానం ఈఓ కేఎస్ రామారావు సూచించారు. రోజు రోజుకు చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని తిప్పికొట్టేందుకు అత్యవసరమైతే తప్పా ఎవ్వరు కూడా ఇంటి నుండి బయటకు రావద్దని కోరారు. శ్రీశైల మండల పరిధిలో గల గ్రామాల్లో కొవిడ్ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలన్నారు. అదేవిధంగా వ్యాక్సినేషన్ చేసుకోవాలని కోరారు.
మండల తహశీల్దార్ ఆదేశాల మేరకు క్షేత్ర పరిధిలో మధ్యాహ్నం నుండి వర్తక వ్యాపారాలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఆలయ ప్రవేశం మెదలు భక్తులు బయటకు వచ్చే వరకు పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్యూలైన్ల వద్ద థర్మల్ గన్ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులు స్వామి అమ్మవార్ల దర్శనానంతరం స్వగ్రామాలకు తిరిగి వెళ్లాల్సిందిగా ఆలయ అధికారులు కోరారు.