AP News | ఏపీలో ఏకంగా 50 లక్షల మందికి చెందిన సమాచారం లేదని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అమరావతిలోని ఏపీ సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించింది. రాష్ట్రంలో 5.4 కోట్ల మంది జనాభాకు గానూ కేవలం 4.9 కోట్ల మంది వివరాలు మాత్రమే ఉన్నాయని తెలిపింది. మిగతా 50 లక్షల మంది ప్రజల సమాచారం ప్రభుత్వం వద్ద లేదని పేర్కొంది.
పురపాలక, రెవెన్యూ, విద్యుత్ పంపిణీ సంస్థలకు చెందిన వివిధ శాఖల్లో ఈ 50 లక్షల మంది సమాచారమే లేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. గతంలో చేపట్టిన సర్వేల్లో వీరెవరూ వివరాలు ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొంది. గ్రామ వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి, కలెక్టర్లు ఈ విషయంపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. జనవరి 31వ తేదీలోగా వారి వివరాలను సేకరించాలని ఆదేశించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో రాష్ట్రంలోని పౌరుల బ్యాంకు వివరాలను అనుసంధానించాలని సూచించారు.
రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ జియో ట్యాగింగ్ ద్వారా అనుసంధానించడంతో పాటు ఫొటోలు కూడా తీయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. గ్రామాలు, హ్యాబిటేషన్ల వారీగా కుటుంబాల మ్యాపింగ్ చేయాలన్నారు.
ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వమని తెలిపారు. విధ్వంసం తర్వాత ఏపీలో పునర్నిర్మాణం జరుగుతుందని అన్నారు. నాశనం జరిగాక దాన్ని తిరిగి నిర్మించినప్పుడు హార్క్వర్క్ అవసరం అవుతుందని చెప్పారు. అయితే హార్డ్వర్క్ ముఖ్యం కాదని.. స్మార్ట్ వర్క్ కావాలని సూచించారు.