తిరుమల : టీటీడీ ఈవో ధర్మారెడ్డితో రేపు(శుక్రవారం ) డయల్ యువర్ ఈవో కార్యక్రమం ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను ఈవో కు ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలియజేయాలనిచ ఇందుకు భక్తులు నంబరు 0877-2263261కు కాల్ చేయాలని సూచించారు.
కాగా నిన్న తిరుమలలోని శ్రీవారిని 75,345 మంది భక్తులు దర్శించుకోగా 36,091 మంది తలనీలాలు సమర్పించుకున్నారని వివరించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 4.52 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని వీరికి 9 గంటల్లో దర్శనం కలుగనుందని వెల్లడించారు.