తిరుమల : భక్తుల్లో ఆధ్యాత్మిక భావవ్యాప్తి కోసం తిరుమల(Tirumala) ఆస్థానమండపంలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు(TTD Chairman ) భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ధార్మిక సదస్సు ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మప్రచార పరిషత్ (Hindu Dharma Prachara Parishad ) ఆధ్వర్యంలో మరింతగా హైందవ ధర్మాన్ని, శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసేందుకు ధార్మిక సదస్సు ఎంతగానో ఉపయోగ పడుతుదని అన్నారు.
అదేవిధంగా మతాంతీకరణకు అడ్డుకట్ట వేసేందుకు, చిన్నవయసు నుంచే పిల్లల్లో మానవతా విలువలను పెంచేందుకు టీటీడీ(TTD) అనేక చర్యలు చేపడుతోందన్నారు. ఇందులో భాగంగా ధార్మిక సదస్సు నిర్వహించి పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలు స్వీకరించి మరింతగా ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు.
ఇప్పటివరకు 57 మంది పీఠాధిపతులు సదస్సుకు విచ్చేసేందుకు సమ్మతిని తెలియజేశారని ఆయన వెల్లడించారు. శ్రీవారి ఆలయం నుండి ఏ సందేశం వెళ్లినా భక్తులందరూ ఆమోదించి ఆచరిస్తారని ఛైర్మన్ తెలిపారు. చైర్మన్ వెంట జెఈవో సదా భార్గవి, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్ కుమార్, ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి తదితరులు పాల్గొన్నారు.