Srisailam | మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైల క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా తరలి రావడంతో సోమవారం క్షేత్రమంతా సందడి సందడిగా మారింది. ఉభయ తెలుగు రాష్ట్రాల యాత్రికులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో శ్రీగిరి పురవీధులు కిటకిటలాడాయి.శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాలకు బారులు దీరిన భక్తుల సర్వ దర్శనానికి సుమారు నాలుగు గంటలు, శ్రీఘ్ర దర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారికి సామూహిక అభిషేకాలు, బిల్వార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు చేసుకున్నారు.
అదే విధంగా సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు దర్శనాలు, వసతి గదులకోసం ఎటువంటి ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేశామని కార్యనిర్వాహణాధికారి ఎస్ లవన్నతెలిపారు. క్షేత్రానికి వచ్చే ముందు ఆన్లైన్ సర్వీసుల ద్వారా కావాల్సిన టిక్కెట్లు బుకింగ్ చేసుకోవాలని ఆయన కోరారు. ఆలయం తెరిచినప్పటి నుండి మూసివేసే వరకు క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు అల్పాహారాన్ని అందిస్తూ ఉదయం 10 గంటలనుంచి అన్నదాన మహాప్రసాదం అందుబాటులో ఉంచారు.
భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్ధానం నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి భక్తులు విరాళాలు ఇచ్చారు. సోమవారం శ్రీశైలక కరివేణ నిత్యాన్నదాన సత్ర సేవాకర్త డీ వెంకట సుబ్రమణ్యశాస్త్రి రూ. లక్ష డీడీ, కర్నూలు వాసి బీ హరికుమార్రెడ్డి రూ. లక్ష విరాళం చెక్ రూపంలో ఆలయ ఏఈవో ధన్పాల్, పర్యవేక్షకురాలు హిమబిందులకు అందించారు. దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, ఙ్ఞాపిక పత్రాన్ని అందజేశారు.
శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్న సిద్దరామ శివాచార్య మహాస్వామి దర్మించుకున్నారు. సోమవారం ఉదయం ఆలయానికి వచ్చిన ఆయనకు ఈఓ లవన్న బిల్వమాలతో అర్చక వేదపండితులచే పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఉభయ దేవాలయాల్లో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకున్న పీఠాధిపతికి వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు.