తిరుమల : వైకుంఠద్వార దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కోరారు. నూతన సంవత్సరం, వైకుంఠద్వార దర్శనాల సందర్భంగా మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త ఏడాది, వైకుంఠద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. 10 రోజుల పాటు ఉత్తరద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేశామని వివరించారు. సర్వదర్శన భక్తులకు తిరుపతిలో తొమ్మిది చోట్ల 92 కౌంటర్లు నెలకొల్పుతున్నామని తెలిపారు.
టోకెన్లు తీసుకుని భక్తులు తిరుమలకు రావాలని సూచించారు. ఉచిత టోకెన్లు ఉన్నవారు కృష్ణతేజ అతిథిగృహం వద్ద రిపోర్టు చేయాలని అన్నారు. రోజుకు రెండువేల చొప్పున శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టికెట్లు జారీ చేశామని, గోవిందమాల వేసుకున్న భక్తులూ టోకెన్లు తీసుకురావాలి పేర్కొన్నారు. భక్తులకు శీఘ్ర దర్శనం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని చైర్మన్ వెల్లడించారు.
వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా చేశారు.
ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.