తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు రావద్దని టీటీడీ ఎప్పుడూ చెప్పలేదని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. భక్తుల రద్దీ అధికంగా ఉందని, వారికి దర్శనం అయ్యే వరకు ఓపికగా వేచి ఉండేలా ఏర్పాట్లు చేసుకుని రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. వేసవి సెలవులు కావడంతో భక్తులు అనూహ్య సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారని వెల్లడించారు.
కరోనా మహమ్మారి కారణంగా దాదాపు రెండు సంవత్సరాలపాటు భక్తులు తిరుమలకు రాలేక పోయారన్నారు. భక్తులకు అవసరమైన ఆహారం, నీరు అందించేందుకు ఏర్పాటు చేశామన్నారు. అధికారులు, ఉద్యోగులు బ్రహ్మాండంగా పని చేస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారని చైర్మన్ అభినందించారు.