తిరుపతి : తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులతో సంయమనం, సహనంతో వ్యవహరించాలని టీటీడీ జేఈవో సదా భార్గవి ఉద్యోగులకు సూచించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగా తిరుపతి లోని 9 ప్రాంతాల్లో సుమారుగా 100 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం అవుతున్నాయి.
సర్వదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లలో విధులకు నియమించిన సిబ్బందికి శుక్రవారం శ్వేత భవనంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఈవో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ కౌంటర్లల్లో విధుల్లో ఉన్న సిబ్బంది యాత్రీకులతో మాట్లాడకుండా వేగంగా టోకెన్లు జారీ చేయాలని చెప్పారు. ఇందులో ఏమైనా సమస్యలు తలెత్తితే ఆయా కేంద్రాల ఇన్చార్జిగా ఉన్న సీనియర్ అధికారి దృష్టికి తేవాలన్నారు. రిలీవర్ వచ్చే వరకు కౌంటర్ నుంచి వెళ్లరాదని ఆమె సూచించారు.
ఆధార్ మాత్రమే గుర్తింపు కార్డుగా తీసుకుని టోకెన్లు జారీ చేయాలన్నారు. ఉద్యోగులకు కౌంటర్ల వద్దకే టిఫిన్, తాగునీరు, కాఫీ,టీ, స్నాక్స్ ఏర్పాటు చేశామన్నారు. శనివారం ఉద్యోగులకు సూచించిన సమయానికి 15 నిముషాల ముందే తమకేంద్రాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని జేఈవో వివరించారు. 10 రోజుల టోకెన్ల కోటా పూర్తయ్యే వరకు నిరంతరాయంగా జనవరి 1వ నుంచి టోకెన్లు జారీ చేస్తామన్నారు.
క్యూలైన్ల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశామని, వారికి అన్న ప్రసాదాలు, టిఫిన్, కాఫీ,పాలు, తాగునీరు అందించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఈవో గోవింద రాజన్, ఐటీ జీఎం సందీప్, శ్వేత డైరెక్టర్ ప్రశాంతి తో పాటు అధికారులు పాల్గొన్నారు.