Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చే యాత్రికులతో పుర వీధులు కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం త్రయోదశి సందర్బంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. సాయంత్రం సంధ్యా సమయంలో నందిమండపం వద్ద కొలువైన శనగలబసవన్నకు ప్రత్యేక క్రతువులు నిర్వహించారు.
ప్రజలు సుఖ సంతోషాలతో బాసిల్లాలని అర్చక పండితులు మహా సంకల్పం పఠించారు. పంచామృతాలు, ఫలోదకాలతోపాటు మల్లికాగుండంలోని శుద్దజలంతో అభిషేకం చేశారు. అనంతరం నందీశ్వరునిపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అధిష్టింప జేసి పంచసూక్తం, వృషభసూక్తంతో ప్రత్యేక పూజలు చేశారు. నూతన వస్త్రాన్ని సమర్పించి నానబెట్టిన శనగలు నైవేద్యంగా సమర్పించారు.
అలాగే వార పూజల్లో భాగంగా గ్రామ దేవత అంకాలమ్మకు కూడా అభిషేకాలు, విశేషార్చనలు నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ అమ్మవారికి ప్రీతికరమైన గులాబీ, గన్నేరు, దేవ గన్నేరు, నంది వర్ధనం, గరుడ వర్థనం, మల్లెలు, చామంతులతో పుష్పాలంకరణ చేసిన ఊయలలో స్వామి అమ్మ వార్లను వేంచేబు చేశారు. అర్చకులు, వేద పండితులు సేవా మహా సంకల్పం పఠించారు. అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, లలితాసహస్త్రనామాలతో షోడశోపచార క్రతువులతో ఊయలసేవ నిర్వహించారు. ఆలయ మాడవీధిలో కళారాధన వేదికపై కళాకారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి