Srisailam | శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో పుర వీధులన్నీ కిటకిటలాడాయి. కార్తీక మాస శోభను సంతరించుకున్న శ్రీశైల మహాక్షేత్రం శివ నామస్మరణతో మార్మోగింది. వరుసగా వారాంతపు సెలవులు, పౌర్ణమి, సోమవారం కలిసి రావడంతో కుటుంబ సమేతంగా క్షేత్రానికి చేరుకున్నారు.
వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు తెల్లవారుజామునే తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గంగాధర మండపం, ఉత్తర మాడవీధి వద్ద దీపాలు వెలిగించి పూజలు చేసుకున్నారు. అనంతరం భక్తులు స్వామిఅమ్మవార్ల దర్శనాలు ఉచిత దర్శనానికి మూడు గంటలు, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనానికి గంట నుండి రెండు గంటల సమయం పడుతున్నది.
సుమారు 60 వేల మందికి పైగా ఉభయ దేవాలయాల్లో దర్శానాలు చేసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మంచినీరు అల్పాహారాన్ని అందిస్తున్నట్లు పౌర సంబంధాల అధికారి శ్రీనివాసరావు తెలిపారు. దర్శనానంతరం బయటకు వచ్చే భక్తులకు అమ్మవారి ఆలయం వెనుక భాగంలో కూడా ప్రసాద వితరణ చేస్తున్నారు.
శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం సాయత్రం ఆలయ ప్రధాన ధ్వజ స్తంభం వద్ద ఈవో పెద్దిరాజు దంపతుల ఆధ్వర్యంలో ఆకాశ దీప ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభంపై ఆవిష్కరించారు.