Srisailam | శ్రీశైలంలోని మహా శివాలయ క్షేత్రం భక్తుల రాకతో కిటకిటలాడుతున్నది. ఉగాది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. వారంతా కాలి నడకన చేరుకుంటుండటంతో క్షేత్ర పురవీధులన్నీ అప్పుడే పండుగ వాతావరణం సంతరించుకున్నాయి. ఈ నెల 30 నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు ఉగాది ఉత్సవాలు జరుగనున్నాయి.
అయితే, శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులకు ఉత్సవాల సమయంలో లింగ దర్శనం ఉండదని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. కేవలం అలంకార దర్శనం మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. కాలినడకన వస్తున్న భక్తులతో దేవస్థానం అనుమతితో పలు స్వచ్ఛంద సేవా సంస్థలు మార్గమధ్యలో అన్న పానీయాలు అందజేస్తున్నారు. వారికి ప్రత్యేక కంకణాలు ఏర్పాటు చేసి శ్రీఘ్రదర్శనం ద్వారా దర్శనానికి అవకాశం కల్పిస్తున్నామని లవన్న తెలిపారు.
ప్రస్తుతం స్వామి అమ్మవార్ల గర్బాలయ స్పర్శ దర్శనాలు జరుగుతున్నాయి. కనుక ఉభయ దేవాలయాల్లో స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకోవడానికి సుమారు 8-10 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. రోజరోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా జిల్లా రెవెన్యూ అధికారులు, దేవస్థానం అధికారులు అప్రమత్తమై ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీ ప్రాంతం నుంచి కాలి నడకన వచ్చే వారికి వైద్య సేవల కోసం దేవస్థానం దవాఖానలో పూర్తి ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు చెప్పారు.
శ్రీశైల క్షేత్రంలో జరిగే ఉగాది ఉత్సవాలకు వేల సంఖ్యలో తరలి వస్తున్న యాత్రికులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లాలని ఈవో లవన్న కోరారు. కుటుంబ సమేతంగా వచ్చే ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులు.. ప్రత్యేకించి వృద్ధులు, చంటి పిల్లలు గల భక్తులు ఉగాది ఉత్సవాల తర్వాత రావాలని సూచించారు. దర్శన అనంతరం భక్తులు రాత్రి వేళ ఇక్కడే ఉండిపోవడంతో తోటి యాత్రికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆలయ అధికారులు తెలిపారు.