విజయవాడ: మరో రెండేండ్ల సమయం ఇచ్చినా పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వదని, జగన్ సర్కార్కు ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలన్న ధ్యాసే లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. అసలు జగన్ వద్ద ప్రణాళికలేవీ లేవని దుయ్యబట్టారు. 2024 వరకన్నా పూర్తవుతుందన్న నమ్మకం లేదన్నారు. కాఫర్ డ్యాం ఎత్తును పెంచడానికి ఎవరి నుంచి అనుమతి తీసుకున్నారో ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయాలని మీడియాతో మాట్లాడుతూ దేవినేని ఉమ డిమాండ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లు గడుస్తున్నా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయలేకపోయిందని దేవినేని ఉమ విమర్శించారు. జగన్కు ప్రణాళికలు అనేవి లేవని, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల కారణంగానే 2024 నాటికి కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్న ఆశ లేదని చెప్పారు. డయాఫ్రం వాల్ అంటే ఏంటో కూడా తెలియని మంత్రి అంబటి రాంబాబు, ఇతర మంత్రులు పోలవరం గురించి మాట్లాడటం విచిత్రంగా ఉన్నదని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టును ఎలా పూర్తిచేయాలో కూడా ముఖ్యమంత్రి వద్ద ప్రణాళిక లేదని దేవినేని ఉమ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో టీడీపీపై ఆరోఫణలు చేయడం విడ్డూరంగా ఉన్నదన్నారు. కాఫర్ డ్యాం ఎత్తును పెంచడానికి ఎవరి అనుమతి తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. దీని ఎత్తు పెంచడానికి పీపీఏ అనుమతించిందా? లేక సీడబ్ల్యూసీ క్లియరెన్స్ ఇచ్చిందా అన్ని నిలదీశారు. మంత్రి అంబటి రాంబాబు చెప్పిన ఈ అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి షెకావత్ అక్షింతలు వేసింది మర్చిపోయిన అంబటి రాంబాబు.. విషయాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు.
2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పీపీఏ రీయంబర్స్ మెంట్ చేస్తే ఆ డబ్బులను ప్రాజెక్టు పనులకు వాడకుండా మళ్లించారని దేవినేని ఉమ ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో దాదాపు రూ.21 వేల కోట్లు వృధా చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థతను కేంద్రం ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూనే ఉన్నదని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నాసిరకం పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. గడచిన మూడేండ్ల కాలంలో పోలవరం పనులను 7 శాతం కూడా పూర్తికాలేదని, ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమన్నారు.