శ్రీశైలం : శ్రీశైల క్షేత్ర ప్రధాన వీధిలో దుకాణాల తరలింపు విషయంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆలయ అభివృద్ది దృష్ట్యా కోర్టు ఉత్తర్వుల అమలులో భాగంగా 24 దుకాణాల తొలగింపునకు గడువు పూర్తికావడంతో ఆదివారం ఉదయం దేవస్థాన అధికారులు పోలీసుల సమక్షంలో గంగాధర మండపం వద్ద దుకాణాలను జేసీబీతో ఆదివారం ఉదయం దేవస్థానం అధికారులు పోలీసుల సమక్షంలో గంగాధర మండపం వద్దనున్న షాపులను కూల్చివేశారు. గంగాధర మండపం వద్ద మహిళలంతాచేరి దేవస్థానం అధికారులు తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ ఈవోకు వ్యతిరేకంగా నినదిస్తూ బైఠాయించారు. ఇన్స్పెక్టర్ దివాకర్రెడ్డి, ఎస్ఐ లక్ష్మణ్రావు నేతృత్వంలో ఆలయ ప్రధానవీధిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తున్న దేవస్థానం అధికారులతో సహకరించాలని ఇన్స్పెక్టర్ వ్యాపారులను సముదాయించారు. దాదాపు 50 సంవత్సరాలుగా ఇవే దుకాణాలను నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని, అర్ధాంతరంగా ఎక్కడికి వెళ్లాలో పాలుపోవడంలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. స్వామిఅమ్మవార్లను నమ్ముకుని జీవిస్తున్న మాపై దేవస్థానం అధికారులు ప్రవర్తిస్తున్న తీరు సరికాదన్నారు. ఇదిలా ఉండగా.. గతంలో డిప్లో పాల్గొని లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్లో దుకాణాలు పొందిన 24 షాపులు స్వచ్ఛందంగా ఖాళీచేసి పాత దుకాణాలను దేవస్థానానికి అప్పగించేందుకు సమయం కావాలని దుకాణదారులు కోరగా.. ఇందుకు ఈవో అంగీకరించారు. ప్రస్తుతం ఉన్న దుకాణాల్లోని సరుకు పూర్తిగా తరలించే వరకు ఒక రోజు గడువు ఇస్తున్నట్లు తెలిపారు.