తిరుమల : వర్షాల కారణంగా విరిగిపడ్డ కొండ చరియలను, దెబ్బతిన రోడ్లను పరిశీలించడానికి , చేపట్టనున్న మరమ్మతుల విషయం చర్చించడానికి నేడు (బుధవారం) సాయంత్రం ఢిల్లీ నుంచి ఐఐటీ నిపుణుల బృందం తిరుమల కు రానుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తెల్లవారుజామున కొండ చరియలతో దెబ్బతిన్న రోడ్లను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో ఇటీవల కురిసిన వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్ల లో కొండ చరియలు విరిగిపడుతున్నాయని తెలిపారు.
ఉదయం 5.45 గంటల సమయంలో ఆర్టీసీ బస్సు తిరుమలకు వెళుతుండగా భారీ శబ్దం, పొగ రావడంతో డ్రైవర్ బస్సు నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చైర్మన్ చెప్పారు. అప్ ఘాట్ రోడ్డులో మరో ఐదారు చోట్ల కొండ చరియలు విరిగిపడే ప్రమాదం గుర్తించామన్నారు. వీలైనంత త్వరలో రోడ్డు మరమ్మతులు చేసి, గట్టి రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని చైర్మన్ చెప్పారు. ఢిల్లీ ఐ ఐ టీ నుంచి నిపుణుల బృందం బుధవారం సాయంత్రానికి తిరుపతికి చేరుకుంటుందన్నారు. టీటీడీ ఇంజినీరింగ్, విజిలెన్స్ అధికారులతో కలిసి వారు ఘాట్ రోడ్ల పరిశీలన చేస్తారన్నారు.
కొండ చరియలు విరిగిపడకుండా ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలనే విషయం పై వారు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి రెండు, మూడు రోజుల్లో నివేదిక సమర్పిస్తారని ఆయన వివరించారు. ఆ తరువాత భవిష్యత్ లో కూడా ఇలాంటి సంఘటనలు జరక్కుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఆయన వెంట జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఈ జగదీశ్వరరెడ్డి, ఈఈ జగన్మోహన్ రెడ్డి, ఈఈ సురేంద్ర రెడ్డి, డీఎఫ్వో శ్రీనివాసులు రెడ్డి తదితరులు ఉన్నారు.