అమరావతి : వర్షాల కారణంగా అనంతపురం జిల్లా కదిరి పాత చైర్మన్ వీధిలో మూడు అంతస్తుల భవనం పక్కనే ఉన్న రెండస్తుల భవనం పడింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులతో సహ మరో ముగ్గురు ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న 15 మందిలో 9 మందిని అధికారులు సురక్షితంగా కాపాడారు. భవనం కూలే సమయంలోనే గ్యాస్ సిలిండర్ పేలినట్లు బాధితులు పేర్కొన్నారు.
జిల్లాలో ఎడతెరపి లేకుండా మూడురోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగానే భవనం దెబ్బతిని.. ఈ ఘటన జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలను ముమ్మరం చేశారు. జేసీబీ సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ ప్రమాదంలో.. గాయపడిన వారికి ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి స్వయంగా వైద్య సహాయం అందజేశారు.