అమరావతి : ఏపీలో విషాదం చోటు చేసుకుంది. నిన్న వాగును దాటుతూ గల్లంతైన ముగ్గురు మృతదేహాలు గురువారం లభ్యమయ్యాయి. అల్లూరి(Alluri )జిల్లా అనంతగిరి మండలం భీంపోలు పంచాయతీ సీతపాడు గ్రామానికి చెందిన గెమ్మెల లక్ష్మి(52), మిర్యాల కమల(40), గెమ్మెల కుమార్ (25) బుధవారం కాశీపట్నం వారాంతపు సంతకు వెళ్లి తిరిగి ఆటోలో ఇంటికి వెళుతుండగా లువ్వాగెడ్డ వాగు సమీపానికి వచ్చేసరికి వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది.
డ్రైవర్ ఆటోను అక్కడే నిలిపివేయడంతో ముగ్గురు వాగును దాటుతుండగా ప్రమాదవశాత్తు ప్రవాహానికి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా కుమార్ మృతదేహం సమీపంలో లభించగా మిగతా ఇద్దరి మృతదేహాలు గురువారం కొంతదూరంలో లభ్యమయ్యాయి. గిరిజనులైన ఈ ముగ్గురు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.