తిరుమల : వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శనివారం టీటీడీ విభాగాధిపతులతో వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశికి టికెట్లు కలిగి ఉన్న భక్తులకే దర్శనానికి అనుమతిస్తామని వివరించారు.
దీనికోసం రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లు రోజుకు 25 వేలుచొప్పున జారీ చేస్తామని వివరించారు. అదేవిధంగా తిరుపతిలోని 9 ప్రాంతాల్లో సర్వదర్శనం టికెట్లు రోజుకు 50 వేలు చొప్పున టోకెన్లు జారీ చేయనున్నామని వెల్లడించారు. పదిరోజుల్లో 7.5 లక్షల మందికి సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శనభాగ్యం లభిస్తుందని అన్నారు. ఈ సమయంలో ఏకాంతంగా శ్రీవారి ఆర్జిత సేవలు నిర్వహిస్తామని తెలిపారు.
తిరుమల స్థానికులకు కౌస్తుభం వద్ద టోకెన్లు, శ్రీవాణి ట్రస్టు దాతలకు ఆన్లైన్ ద్వారా టికెట్ల జారీని కొనసాగిస్తామన్నారు. మహాలఘు ద్వారానే అందరికీ స్వామివారి దర్శనం లభిస్తుందని ఈవో పేర్కొన్నారు. డిసెంబర్ 29 నుంచి జనవరి 3 వరకు తిరుమలలో అడ్వాన్స్ గదుల బుకింగ్ నిలిపివేస్తామన్నారు. సీఆర్వో వద్దనే గదులను కేటాయిస్తామని ఆయన తెలిపారు.