Cyber Fraud | టెలికం సంస్థలు కఠిన నిబంధనలు తెస్తున్నా.. ఆర్బీఐ స్పష్టమైన మార్గదర్శకాలు తీసుకొచ్చినా.. ‘పాస్ వర్డ్’లతో భద్రతా కవచం ఏర్పాటు చేసినా.. సైబర్ మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూనే ఉన్నారు. తాజాగా ఆన్ లైన్ కొలువుల పేరుతో సైబర్ మోసగాళ్లు రూ.35 కోట్లకు శఠగోపం పెట్టారు. ఈ సైబర్ మోసగాళ్ల భారీన పడిన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలానికి చెందిన మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు సంగతి బయట పడింది. రూ.2 లక్షలు కోల్పోయిన ఆ మహిళ ఫిర్యాదుతో కదిలిన పోలీసులు దర్యాప్తు చేసి ఓ నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
కరోనా తర్వాత పాపులర్ అయిన ‘వర్క్ ఫ్రం హోం’ పేరిట లింక్లు పంపారు సైబర్ మోసగాళ్లు. సదరు బాధితుల ఖాతాలకు కొద్ది మొత్తం బదిలీ చేసి నమ్మించారు. ఎక్కువ టైం పని చేస్తే లక్షల్లో చెల్లిస్తామని నమ్మ బలికారు.. అయితే వారి ఖాతాల్లో 10 శాతం డిపాజిట్ చేయాలని బాధితులపై నిందితులు ఒత్తిడి తెచ్చారు. అలా నమ్మిన కొందరు బాధితులు కొంత మొత్తం పంపించిన తర్వాత తత్త్వం బోధ పడింది. తాము మోసానికి గురయ్యామని తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదులపై కదిలిన పోలీసులు దర్యాప్తు చేస్తే.. సైబర్ మోసగాళ్లు నెల్లూరు కేంద్రంగా యువతను మోసగిస్తూ రూ.35 కోట్లు స్వాహా చేశారని గుర్తించారు.
దేశమంతా 11 డొల్ల కంపెనీలు స్థాపించి 172 బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేశారు. బాధితుల ఖాతాల నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఈ సంగతి గుర్తించిన పోలీసులు సదరు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. నెల్లూరులోని ఒక బ్యాంకు ఖాతాలో రూ.14 లక్షలు జప్తు చేసి.. ఆ ఖాతా నిర్వహిస్తున్న నిందితుడు సమద్ను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. ప్రధాన నిందితులను అరెస్ట్ చేయడానికి స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామని తెలిపారు.