అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సైబర్ నేరాలు ( Cyber crimes ) గణనీయంగా పెరిగాయి. ఒక ఏడాదిలోనే రూ. 1,229 కోట్ల సొత్తును సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. ముఖ్యంగా ఫోన్కాల్స్ ద్వారా పోలీసులకు 7,23,378 ఫిర్యాదులు అందడం రికార్డు. 2024లో రాష్ట్రంలో జరిగిన నేరాలను డీజీపీ ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumala Rao) వెల్లడించారు. సగటున రోజుకు రూ. 3.36 కోట్లను సైబర్ నేరగాళ్లు డబ్బును దోచుకున్నారని వివరించారు.
2023లో ఫోన్కాల్స్ ద్వారా 4.74,391 కాల్స్ రాగా 682 కేసుల్లో రూ. 173 కోట్లను బాధితులు నష్టపోయారు. 2024లో 52.4 శాతం ఫిర్యాదులు పెరుగగా బాధితుల నుంచి 610 శాతం సొత్తును కోల్పోయ్యారని డీజీపీ తెలిపారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గంజాయి (Ganja) , మాదకద్రవ్యాలను (Drugs) అరికట్టడానికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టినా కాని గతంలో కంటే ఎక్కువగా కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.
మొత్తంగా అన్ని రకాల నేరాలపై గతేడాది 97,760 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం 92,094కు పరిమితమైందన్నారు. ఈ ఏడాది హత్యలు, హత్యాయత్నం కేసులు తగ్గగా, లాభం కోసం హత్యలు, దోపిడీలు, పగలు, రాత్రి వేళల్లో ఇళ్లలో దొంగతనాలు ఎక్కువయ్యాయని తెలిపారు.
మహిళల హత్యలు పెరుగగా అత్యాచారాలు, వరకట్న చావులు, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలు గణనీయంగా తగ్గాయని వివరించారు. ఏపీలో గత ఏడాది 18,597 రోడ్డు ప్రమాదాల్లో 8,136 మంది చనిపోగా 20,977 మంది గాయపడ్డారని తెలిపారు. 2024లో 17,688 రోడ్డు ప్రమాదాల్లో 7,863 మంది చనిపోగా 19,711 మంది క్షతగాత్రులయ్యారని అన్నారు.