తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కొండకు చేరుకుంటున్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులు మొత్తం రెండు కంపార్ట్మెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 69,221 మంది భక్తులు దర్శించుకోగా 24,409 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.45 కోట్లు వచ్చిందని వివరించారు.
గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
తిరుపతి టీటీడీపరిపాలన భవనంలో గురువారం నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరిపాలన భవనం వెనక వైపున గల పరేడ్ మైదానంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవి ధర్మారెడ్డి ఉదయం 8.30 గంటలకు జాతీయ జెండాను ఎగురవేసి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు.
విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ భద్రతా విభాగంలోని బెటాలియన్ల పరేడ్, విద్యాసంస్థల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారని వెల్లడించారు.