తిరుమల : తిరుమల (Tirumala ) లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్షదైవంగా కొలవబడుతున్న వేంకటేశ్వస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని టీటీడీ ఆలయ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 64,552 మంది భక్తులు దర్శించుకోగా 19,900 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.91 కోట్లు వచ్చిందన్నారు.
సూర్యప్రభ వాహనంపై దర్శనం
తిరుపతిలోని శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో బుధవారం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనం (Suryaprbha Vahanam) పై శ్రీరామ కృష్ణ గోవింద అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన గురువారం రథోత్సవం వైభవంగా జరుగనుందని ఉదయం 5 గంటలకు స్వామివారు రథారోహణం చేసి ఉదయం 8 గంటలకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని పేర్కొన్నారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరిస్తారని వెల్లడించారు.