తిరుపతి : గోవు హిందువులకు తల్లి లాంటిదని, భగవంతునితో సమానంగా భావించి పూజలు చేస్తారని, అలాంటి గోవును సంరక్షించుకోవాల్సిన బాధ్యత భారతీయులందరిపైనా ఉందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి (Karunakar Reddy) పేర్కొన్నారు. గోకులాష్టమి ( Gokulashtami ) సందర్భంగా గురువారం టీటీడీ ఎస్వీ గోసంరక్షణశాలలో గోకులాష్టమి-గోపూజ మహోత్సవాలు నిర్వహించారు. అలిపిరి వద్ద గల సప్తగోప్రదక్షిణ మందిరంలో వేణుగోపాల స్వామివారికి అభిషేకం చేశారు.
గోశాలలో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ మీడియాతో మాట్లాడారు. గోశాలలో సాహివాల్ (Sahivaal) గోసంతతి అభివృద్ధి కోసం చేపడుతున్న చర్యలను గుర్తించి రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం రూ.40 కోట్ల గ్రాంట్ (Grant) అందించిందని వెల్లడించారు. టీటీడీ (TTD) కొన్ని సంవత్సరాలుగా గోసంరక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోందని చెప్పారు. గోమాత విశిష్టతను తెలిపేలా అవసరమైన రైతులకు గోవులను దానంగా ఇస్తున్నట్టు చెప్పారు.
పూర్వపు రోజుల్లో ప్రతి రైతు ఇంట్లో గోవులు ఉండేవని, గతంలో ఒట్టిపోయిన గోవులను రైతులు గోశాలకు ఇస్తే, వాటిని సంరక్షించేవారని వివరించారు. గతంలో తాను ఛైర్మన్ గా ఉన్నప్పుడు వందే గోమాతరం పేరుతో అంతర్జాతీయ సదస్సు నిర్వహించామని, ఇద్దరు నోబెల్ గ్రహీతలు కూడా ఇందులో పాల్గొని గో ఉత్పత్తులు మానవాళికి ఏ విధంగా ఉపయోగపడతాయనే విషయంపై చర్చించారని చెప్పారు.
అనంతరం వేణుగోపాల స్వామిని చైర్మన్ దర్శించుకున్నారు. అక్కడినుంచి గో మందిరానికి చేరుకుని, గోవు, దూడకు శాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించి పూల దండలు వేసి, నూతన వస్త్రాలు సమర్పించారు. దాణా, మేత తినిపించి పాలు సేకరించారు.ఈ కార్యక్రమంలో ఎస్వీ గో సంరక్షణ కమిటీ సభ్యులు రామ్ సునీల్ రెడ్డి, సీబీ ఎస్వో నరసింహ కిషోర్, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, డిప్యూటీ ఈవో శాంతి పాల్గొన్నారు.