Chandrababu | హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): బెయిల్పై విడుదలైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు మరిన్ని షరతులు విధించాలని కోరుతూ ఏపీ సీఐడీ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు ఎటువంటి పత్రికా సమావేశాలు నిర్వహించకుండా నిలువరించాలని, రాజకీయ ర్యాలీల్లో పాల్గొనకుండా చూడాలని, ఆయన రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించి హైకోర్టుకు నివేదికలు ఇచ్చేలా ఇద్దరు డీఎస్పీలకు ఆదేశాలు ఇవ్వాలని కోరింది.
ఈ పిటిషన్పై కౌంటర్ వేయాలని కోర్టు చంద్రబాబు తరఫు న్యాయవాదులకు సూచించింది. బాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తీసుకోలేదని అదనపు అటార్నీ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదించగా, దీనిపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, కోర్టు ముందున్న వివరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తాము మధ్యంతర బెయిల్ మంజూరు చేశామని స్పష్టం చేసింది. దీనిపై ఏవైనా అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని చెప్పింది.
హైదరాబాద్కు చేరుకున్న చంద్రబాబు
చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి బుధవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం వద్ద ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కాగా, చంద్రబాబును ఆయన నివాసంలో ఏఐజీ బృందం కలిసింది. వైద్యుల సూచన మేరకు గురువారం ఉదయం పది గంటలకు చంద్రబాబు ఏఐజీ దవాఖానకు వెళ్లనున్నారు.