ఏపీ : కరోనా కేసులు(Corona Cases) మళ్లీ పెరుగుతుండడంతో ఏపీ ప్రభుత్వం ముందు జాగ్రర్త చర్యలు తీసుకుంటుందని ఏపీ వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎంటి. కృష్ణబాబు(Krishna Babu) వెల్లడించారు. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలో కొవిడ్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉన్నామని వివరించారు. ఏపీలోని 12 మెడికల్ కళాశాలల్లో ఆర్టీపీసీఆర్ (RTPCR) పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని , ప్రతీ గ్రామ సచివాలయానికి పది ర్యాపిడ్ కిట్లు అందుబాటులో ఉంచామని ఆయన పేర్కొన్నారు.
ఏపీలో 33 వేలకి పైగా ఆక్సిజన్ బెడ్స్, 6 వేలకి పైగా ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. వెంటిలేటర్లకు, కొవిడ్ మందులకి కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. జ్వరంతో బాధ పడుతున్న రోగులను ర్యాపిడ్ కిట్లతో పరీక్షించి వారిలో పాజిటివ్ వస్తే వారి శాంపిల్స్ ఆర్టీపీసీఆర్ ల్యాబులకు పంపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పాజిటివ్ వచ్చిన వారిలో కొవిడ్ వేరియంట్ తెలుసుకోవడానికి విజయవాడలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్లో పరీక్షలు చేస్తామని వివరించారు.
పొడి దగ్గు, డయేరియా లాంటి లక్షణాలు జేఎన్ 1 కొత్త వేరియంట్లో కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారని తెలిపారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతోందని అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. మాస్క్ ధరించడం లాంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.