తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 12 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. నిన్న శ్రీవారిని 63,366 మంది భక్తులు దర్శించుకోగా 24,494 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.4 కోట్లు వచ్చిందని వెల్లడించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటాను రేపు (గురువారం)ఉదయం 9 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. రోజుకు రెండువేల టికెట్లు చొప్పున ఆన్లైన్లో విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతోపాటు రూ.300 దర్శన టిక్కెట్ కొనుగోలు చేయాలని తెలిపారు. ఆన్లైన్లో ఈ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు మహా లఘు దర్శనం(జయ విజయుల వద్ద నుంచి మాత్రమే) ఉంటుందని వివరించారు.