తిరుపతి: ఏపీలో ఏకైక రాజధాని ఉండాలంటూ చేపట్టిన అమరావతి రైతుల ఆందోళనలకు వ్యతిరేకంగా శనివారం రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ఆందోళనలు మొదలయ్యాయి. దీంట్లో భాగంగా తిరుపతిలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అని నినాదాలు చేశారు.
సభకు అధ్యక్షత వహించిన రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి, రాయలసీమ అధ్యయన సంస్థ అధ్యక్షుడు భూమన్ మాట్లాడుతూ..రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలంటే ఉత్తరాంధ్ర, రాయల సీమల్లోనూ రాజధానులు ఉండాలని అన్నారు. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితమయితే మిగతా ప్రాంతాలు నష్టపోతాయని వారు పేర్కొన్నారు. . అమరావతిలోనే రాజధాని ఉండాలని చేసిన డిమాండ్ ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో రిలేదీక్షలు చేపడతామని, వికేంద్రీకరణ సాధన కోసం మహా పాదయాత్రకు సిద్ధమవుతామని వారు వెల్లడించారు.
ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన విధంగా సమగ్రాభివృద్ధి బిల్లుకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు.