అమరావతి : తెలంగాణలో విజయవంతంగా అమలైన సమగ్ర భూ సర్వే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు నుంచి అమలు చేస్తుంది. దీంట్లో భాగంగా ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని తాడేపల్లి నుంచి వర్చువల్గా ప్రారంభించారు. భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి దశలో రీసర్వే పూర్తయిన భూ రికార్డులు ప్రజలకు అంకితం చేస్తున్నామని వెల్లడించారు. తొలిదశలో 51 గ్రామాల్లోని 21, 404 కమతాల్లో రీసర్వే పూర్తి చేశామన్నారు.
ప్రతి గ్రామంలో వివాదాలకు తావు లేకుండా ప్రజల ఎదుటే రిజిస్ట్రేషన్ చేయిస్తామని పేర్కొన్నారు. సివిల్ వివాదాలకు ముగింపు పలకాలనే ఉద్దేశంతో సమగ్ర భూసర్వేను నిర్వహిస్తున్నామని జగన్ వెల్లడించారు. వందేళ్ల తరువాత సమగ్ర భూసర్వే చేపట్టడం ఆనందంగా ఉందని అయన అన్నారు. యజమానులకు శాశ్వత భూ హక్కులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ఇంటి స్థలం, పొలాలు రికార్డులు రిజిస్ట్రేషన్ రికార్డుల్లో ఒకమాదిరిగా.. భూముల వద్దకు వెళ్తే కొలతల్లో మరో మాదిరిగా ఉంటుందని పేర్కొన్నారు.