Plastic ban in Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో ప్లాస్టిక్ వాడకంపై పూర్తి నిషేధం అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దేవస్థానం కార్య నిర్వహణాధికారి (ఈవో) ఎస్ లవన్న తెలిపారు. ప్లాస్టిక్ వాడకంపై నిషేధం అమలుకు దేవస్థానం నిబంధనలు, ఆంక్షలు పాటించేలా సమర్థవంతమైన అధికారులు, సిబ్బందితో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కమిటీలు ప్రతినిధ్యం నిషేధం అమలుతీరును తనిఖీలు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.
వివిధ ప్రాంతాల నుంచి స్వామి అమ్మవార్ల దర్శనానికి శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నదని ఎస్ లవన్న చెప్పారు. ఈ నేపథ్యంలో మహాక్షేత్ర పరిసరాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. అందు కోసం వ్యాపారులు, స్థానికులకు పలు అవగాహనా సదస్సులు కూడా నిర్వహించినా ప్రయోజనం ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాన కూడళ్లలోని హోటళ్లు, టీస్టాళ్ల వద్ద వాటర్ బాటిళ్లు, కిరాణ షాపుల్లో పార్శిల్ కవర్ల వాడకం నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకోవాలని శానిటేషన్ విభాగపు అధికారులు, సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేసినట్లు లవన్న తెలిపారు. క్షేత్ర పరిధిలో వర్తక, వ్యాపార సంస్థలు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు తదితర సంస్థల యజమానులకు ప్లాస్టిక్ నిషేధంపై తాఖీదులు జారీచేస్తామన్నారు. ప్లాస్టిక్ నిషేధ నిబంధనలు అమలయ్యేలా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దేవస్థానం నిర్ణయాలను నిబంధనలను ఉల్లంఘించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.