అమరావతి : ఏపీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలోనే గుడివాడలోని సొంత కన్వెన్షన్లోనే క్యాసినోను నిర్వహించారని ఆరోపిస్తూ రేపు (గురువారం) టీడీపీ నాయకులు ఏపీ గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నారు. గుడివాడ క్యాసినో వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన నిజనిర్ధారణ కమిటీ ఈమేరకు గవర్నర్ను కలవడానికి అపాయిమెంట్ను తీసుకుంది. రేపు ఉదయం 11.30కు గవర్నర్ను కలిసి క్యాసినోపై కరపత్రాలు, ఆధారాలను అందించనుంది. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలని కమిటీ సభ్యులు కోరనున్నారు.
క్యాసినోపై ముఖ్యమంత్రి ఏమీ జరగనట్టు నటిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. క్యాసినో నిర్వహించేందుకు నాలుగు నెలలుగా ఏర్పాట్లు జరుగుతుంటే పోలీసులకు సమాచారం లేదంటే ఎవరు నమ్ముతారని పేర్కొన్నారు.