తిరుమల : అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జరిగే రెండు బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు టీటీడీ (TTD) ఈవో ఎవి.ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమల (Tirumala) అన్నమయ్య భవనంలో గురువారం జిల్లా కలెక్టర్, ఎస్పీ, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్, టీటీడీలోని అన్నివిభాగాల అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు బ్రహ్మోత్సవాలకు భక్తులు(Brahmotsavam) పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని ఇందు కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నామని వివరించారు. సెప్టెంబర్ 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. సెప్టెంబరు 18న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.
బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు (Common devotees) పెద్దపీట వేస్తామని, వారికి సంతృప్తికరంగా వాహనసేవల దర్శనంతోపాటు మూలమూర్తి దర్శనం కల్పిస్తామని చెప్పారు. బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేశారు. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే అనుమతిస్తామని వివరించారు.
వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసినట్టు వెల్లడించారు. భక్తుల భద్రత దృష్ట్యా సెప్టెంబరు 22న గరుడసేవ (Garuda Seva) రోజున ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేశామన్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో తొమ్మిది రాష్ట్రాల నుంచి కళాకారులను ఆహ్వానించి వాహనసేవల ఎదుట కళాప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని వివరించారు.