అమరావతి: ఏపీలో సినిమా టికెట్ల ధరల వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల వ్యవహారంపై సచివాలయంలో ప్రభుత్వ కమిటీ మారోసారి భేటీ అయింది. కమిటీ సభ్యుల సూచనలు, సలహాలపై ఈరోజు చర్చించనున్నారు. కమిటీ నివేదిక ఆధారంగా టికెట్ రేట్ల సవరణ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కమిటీ గత నెలలో భేటీ అయిన సమయంలో ఎగ్జిబిటర్లు,డిస్ట్రిబ్యూటర్లు బీ,సీ సెంటర్లలో టికెట్ ధరలు పెంచాలని కోరారు. సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో 35ను జారీ చేసింది. దీంతో పలు థియేటర్లు మూతపడ్డాయి. ప్రభుత్వ జీవో రేట్లతో థియేటర్లు నడపలేమని యాజ మాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కారు సినీ ప్రముఖుల విజ్ఞప్తి మేరకు సినిమా టికెట్ రేట్ల కమిటీ ఏర్పాటు చేసింది.