అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ విజయవాడలో తలపెట్టిన ఛలో సీఎంవో కార్యాలయం ముట్టడిపై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. సీపీఎస్ అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వ కమిటీ వేసిందని, ఆ కమిటీ అధ్యయనం తర్వాత జరిగే కమిటీ భేటీలో సీపీఎస్పై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తొందరపడి సీఎంవో ముట్టడికి వెళ్లడం భావ్యం కాదని ఆయన అన్నారు.
అవకాశం ఉన్నంతవరకు ప్రతి అంశాన్నీ పరిష్కరిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఛలో సీఎంవో పిలుపు సందర్భంగా విజయవాడలో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. నగరంలో 144 సెక్షన్ను విధించి 30 యాక్ట్ను అమలు చేస్తున్నారు. సీఎంవో కార్యాలయం వద్ద బారికెడ్లు ఏర్పాట్లు చేశారు. విజయవాడలోని హోటల్స్, లాడ్జీలు, రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద నిఘా ఉంచారు. విజయవాడ వైపు వచ్చే అన్ని దారుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ద్విచక్రవాహనాలతో సహా అన్ని రకాల వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.