తాడేపల్లి: స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా త్రివర్ణ పతాకాన్ని ఈ సందర్భంగా సీఎం జగన్ ఆవిష్కరించారు. అదేవిధంగా పింగళి వెంకయ్య జీవిత చరిత్ర ఆధారంగా ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్ను జగన్ ప్రారంభించి తిలకించారు.
పింగళి వెంకయ్య 146 వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా సీఎం జగన్ వెల్లడించారు. దేశ ప్రజలు గర్వించేలా మువ్వన్నెల జెండాను రూపొందించిన తెలుగు వ్యక్తి పింగళి వెంకయ్య అని కొనియాడారు. ‘కుల, మత, ప్రాంతాలకతీతంగా త్రివర్ణపతాకాన్ని గుండెల నిండా పెట్టుకున్న ప్రజలందిరికీ సెల్యూట్ చేస్తున్నా’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
ఇలాఉండగా, పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా పోస్టల్ శాఖ ప్రత్యేక కవర్ను ఆవిష్కరించింది. కాగా, ఆయన స్వస్థలం కృష్ణా జిల్లాలోని భట్టపెనుమర్రులో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి జోగి రమేశ్ పాల్గొనగా.. నగరిలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ఆర్కే రోజా హాజరయ్యారు. ఇంటింటా జెండా ఎగరేసేందుకు దేశం పిలుపునివ్వడం తెలుగుజాతికి పింగళి గౌరవం సాధించి పెట్టడమే అని చంద్రబాబు ట్విట్టర్లో నివాళులర్పించారు.