అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. ఉదయం 10.50 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలు దేరి మధ్యాహ్నం 1.05 నిమిషాలకు ఢిల్లీ చేరుకుంటారు. అధికారిక నివాసం నుంచి సాయంత్రం 3.45 నిమిషాలకు ప్రధాని కార్యాలయానికి వెళ్లి మోదీని కలువనున్నారని అధికార వర్గాలు వెల్లడించారు. సీఎం జగన్ రెండురోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు.
ప్రధానితో భేటీలో పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ ఎస్టిమేషన్ ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వివిధ పథకాల కింద రాష్ట్రానికి పెండింగ్లో ఉన్న బకాయిల విడుదల గురించి ప్రధానికి వినతి పత్రం సమర్పించ నున్నారు. ఆయన వెంట వైసీపీకి చెందిన పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, సంబంధిత అధికారులు కూడా ఉండనున్నారు.