అమరావతి: ముఖ్యమంత్రిగా తనను దింపాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయపు మీడియా సంస్థలు అబద్ధాన్ని నిజం చేయాలని చూశాయన్నారు. పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయంపై సీఎం మీడియాతో మాట్లాడారు.
పరిషత్ ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వానికి అండగా ఉంటున్న ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. ఫలితాలు బాధ్యతను మరింత పెంచాయని చెప్పారు. ప్రతిపక్షం ఓటమిని కూడా అంగీకరించలేని పరిస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో 99 శాతం, 81 శాతం పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులను జనం ఎన్నుకున్నారని వెల్లడించారు. ప్రతి ఎన్నికల్లో ప్రజలు సడలని ఆప్యాయతను అందిస్తున్నారని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని తెలిపారు.