అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి పార్థీవదేహానికి భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఘన నివాళి అర్పించారు. విశాఖపట్నంలో నిన్న గుండెపోటుతో మరణించిన శేషాద్రి భౌతికకాయాన్ని తిరుపతిలోని ఆయన నివాసానికి తరిలించారు. కాగా మంగళవారం ఉదయం ఆయన భౌతికకాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు.
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ శేషాద్రి నివాసానికి వెళ్లారు. అనంతరం ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుఛ్చాలు ఉంచి నివాళి అర్పించారు. సీజేఐ వెంట తెలంగాణ ఆర్అండ్బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్రెడ్డి తదితరులు ఉన్నారు.
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. గత 25 సంవత్సరాలుగా స్వామివారికి అంకితమై సేవలందించారని అన్నారు. అనారోగ్య సమస్యలున్నా వాటిని పట్టించుకోకుండా సేవలు అందించారని , శేషాద్రి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆయన వెల్లడించారు. డాలర్ శేషాద్రి అంత్యక్రియలు ఈ రోజు తిరుపతిలోని సత్యహరిశ్చంద్ర శ్మశానవాటికలో నిర్వహించనున్నారు.