అమరావతి: న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయ వ్యవస్థను పరిష్ట పరిచే కార్యక్రమాల్లో ప్రభుత్వాల భాగస్వామ్యం తప్పనిసరని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నూతన కోర్టుల భవనాల సముదాయాన్ని సీఎం జగన్తో కలిసి సీజేఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలందరికి సత్వర న్యాయం చేకూర్చే బాధ్యత న్యాయవాదులపై ఉందని చెప్పారు. న్యాయవ్యవస్థలో ఖాళీలను భర్తీ చేసుకుంటూ వచ్చామన్నారు.
సమాజంలో మార్పు కోసం న్యాయవాదులు కృషి చేయాలన్నారు. సీనియర్ న్యాయవాదులు జూనియర్లను ప్రోత్సహిస్తే బాగుంటుందని సూచించారు. సమాజం శాంతియుతంగా, ఐకమత్యంతో ఉంటే అభివృద్ధి చాలా సులువుగా జరుగుతుందని చెప్పారు. కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఈ నేపథ్యంలో కోర్టు భవనాల నిర్మాణానికి నిధుల కోసం కేంద్రాన్ని కోరామన్నారు. కేంద్ర నిధులు ఇస్తే సహకరించినట్లవుతుందని చెప్పారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
తన ఉన్నతికి, విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. న్యాయవ్యవస్థలో తనవంతుగా చాలా ఖాళీలు పూర్తిచేశానన్నారు. అన్ని కులాలు, ప్రాంతాల నుంచి వచ్చినవారికి ప్రాతినిధ్యం కల్పించామని వెల్లడించారు.