శ్రీశైలం : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దంపతులు శుక్రవారం భ్రమరాంబ, మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఎన్వీ రమణ దంపతులు ప్రత్యేక పూజలు, అర్చన, స్వామివారి అభిషేకం చేశారు. అర్చకులు సీజేఐ దంపతులకు ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. అంతకుముందు వారికి నంది కేతన అతిథి గృహం వద్ద ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తోపాటు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. సీజేఐ ఎన్వీ రమణ వెంట నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, కలెక్టర్ జి వీరపాండియన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, డీఐజీ వెంకటరామిరెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణ కృపా సాగర్, ఎస్పీ డాక్టర్ కె. పక్కిరప్ప, ఏపీ హైకోర్టు రిజిస్టర్ న్యాయమూర్తి జస్టిస్ డి వెంకటరమణ, తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వర్ రెడ్డి, జస్టిస్ డి. నాగార్జున, జిల్లా జడ్జి ఫ్యామిలీ కోర్టు వి. శ్రీనివాస్, దేవస్థాన ఈఓ కేఎస్ రామరావు ఉన్నారు.