తిరుపతి : అల్పపీడనం కారణంగా గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలతో తిరుపతి నగరం జల సముద్రమైంది. కనుచూపు మేర వరద నీటితో తిరుపతి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వరద కారణంగా పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. మధురానగర్లో 5అడుగులు, ప్రధాన రోడ్లపై 3 అడుగుల మేర వరద ప్రవాహం తీవత్రను తెలియజేస్తుంది. లక్ష్మీనారాయణ స్వామి, వేణుగోపాల స్వామి ఆలయాల్లోకి వరద నీరు రావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శేషాచల కొండల నుంచి భారీగా కింది భాగాన ఉన్న తిరుపతిలోకి వరద నీరు వస్తుండడంతో సమస్య ఉత్పన్నమవుతుందని అధికారులు పేర్కొన్నారు.
దీనికి తోడు తుమ్మల గుంట చెరువు తెగడం కూడా కారణమని వెల్లడించారు. వరద రాజనగర్లో వాహనాలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కపిల తీర్థం జలదిగ్భందనంలో చిక్కుకుంది. తిరుపతిలో పరిస్థితిపై అర్బన్ ఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన సూచించారు.