మద్దూరు (ధూళిమిట్ట), మే 2: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం హనుమతండాకు చెందిన తొమ్మిదేండ్ల బాలుడు జాటోత్ విహాన్రామ్ అస్ట్రేలియా ఖండంలోనే అత్యంత ఎత్తైన కోసియస్కో శిఖరాన్ని అధిరోహించాడు. అంతర్జాతీయ పర్వతారోహకుడుడైన విహాన్రామ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానాన్ని సంపాదించాడు. విహాన్రామ్ గతంలో ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని(5,685 మీటర్లు) జయించారు.
హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో ఉన్న సవాలుతో కూడిన పాతల్సు పర్వతాన్ని(4,250 మీటర్లు) అధిరోహించాడు. తాజాగా కోసియాస్కో (7,310 అడుగులు) (2,228 మీటర్లు) పర్వతాన్ని అధిరోహించి స్ఫూర్తిగా నిలిచాడు. ‘మాదక ద్రవ్యాలు వద్దు’ అనే నినాదంతో విహాన్రామ్ ఈ యాత్రను కొనసాగించాడు. మాదకద్రవ్య రహిత జీవనశైలిని ప్రోత్సహించే బ్యానర్ పట్టుకొని, ఆరోగ్యం, క్రీడలు, సానుకూల లక్ష్యాలపై దృష్టి పెట్టమని యువతను ప్రోత్సహిస్తున్నాడు.