Sunil Kumar | సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్ను ఏపీ ప్రభుత్వం పొడిగించింది. ఆలిండియా సర్వీసెస్ రూల్స్ 1969 లోని రూల్ 3(3) ప్రకారం, ఆయనపై ఉన్న అభియోగాలు తీవ్రమైనవి కావడంతో సర్వీసులో కొనసాగించడం సముచితం కాదని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఆయన సస్పెన్షన్ను పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. క్రిమినల్ కేసు పూర్తి లేదా పదవీ విరమణలో ఏది ముందైతే అప్పటి వరకు ఈ సస్పెన్షన్ కొనసాగనుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
సునీల్ కుమార్ ఏపీ కేడర్కు చెందిన 1993వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి. వైసీపీ హయాంలో సీఐడీ చీఫ్గా పనిచేశారు. ఆ సమయంలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుపై జరిగిన కస్టోడియల్ టార్చర్ ఆరోపణలతో రెండేళ్ల క్రితం గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ క్రైమ్ నంబర్ 187/2024 కేసు దర్యాప్తు దశలో ఉంది. ఈ కేసు ఆయన సర్వీస్ హోదాతో నేరుగా సంబంధం కలిగి ఉన్నందున, ఆయన్ను సర్వీసులోకి తీసుకుంటే సాక్ష్యాధారాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.