Srisailam | శ్రీశైలంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీశైలం జలాశయం సమీపంలో రోడ్డు పక్కన గోడపై కూర్చొని చిరుత కనిపించింది. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా చిరుతను చూసి ఉలిక్కిపడ్డారు. మరికొందరు ప్రయాణికులు రోడ్డుపై కూర్చున్న చిరుతపులిని వీడియో తీసి సోషల్మీడియాలో పోస్టు చేశారు. చిరుత సంచారం నేపథ్యంలో స్థానికులు, శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు.
శ్రీశైలంలో ఇటీవల చిరుత సంచారం ఎక్కువైంది. ఇటీవల ఆర్టీసీ బస్టాండ్, ఏఈవో నివాసానికి సమీపంలో కూడా చిరుత కనిపించిందనే వార్తలు వైరల్గా మారాయి. ఈ క్రమంలో భక్తులతో పాటు స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ, దేవస్థానం ఉన్నతాధికారులు సూచించారు. స్థానికులు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లొద్దని సలహానిచ్చారు.
శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుత కలకలం..
శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న భక్తులకు కనిపించిన చిరుత
రోడ్డు పక్కన గోడపై కూర్చుని ఉన్న చిరుత
చిరుతను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడిన యాత్రికులు
తమ సెల్ ఫోన్ లో చిరుతను బంధించిన యాత్రికులు
రోడ్డు పక్కన చిరుత కనిపించడంతో భయాందోళనకు గురైన… pic.twitter.com/Yj9aWDw917
— BIG TV Breaking News (@bigtvtelugu) December 15, 2024
మరోవైపు నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలోనూ చిరుత సంచరం కలకలం రేపుతోంది. గాజులపల్లి సమీపంలో స్థానికులకు చిరుత కనిపించింది. దీంతో వారు వెంటనే పోలీసు సమాచారం అందించారు. దీనిపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించామని.. అధికారులు బోను ఏర్పాటు చేసే వరకు స్థానికులు, యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా తిరగవద్దని హెచ్చరించారు.