అమరావతి : రాష్ట్రంలో చీప్ లిక్కర్ అమ్మకాలు ఎక్కడా జరుగడం లేదని ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఏపీలో మద్యం అమ్మకాలపై స్వల్ప కాలిక చర్చపై జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో కొన్ని డిస్టిలరీలు టీడీపీ నాయకులకు చెందినవని ఆయన ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి రాగానే 43వేల బెల్ట్షాపులను రద్దు చేశామని, మరో 4వేల షాపుల దగ్గర ఉన్న పర్మిట్ రూంలు తొలగించామని పేర్కొన్నారు.
చంద్రబాబు హయాంలో 14 కొత్త డిస్టిలరీలను అనుమతి ఇవ్వగా 254 బ్రాండ్లు వచ్చాయని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క డిస్టిలరీకి కానీ ఒక్క బ్రూవరీకి కానీ అనుమతి ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గించడానికే ధరలు పెంచామని స్పష్టం చేశారు. లిక్కర్ దుకాణాలను ప్రభుత్వమే నడిపిస్తుందని వీటిని సగానికి తగ్గించిన ఘనత తమదేనని జగన్ అన్నారు,
జంగారెడ్డి గూడెం మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. చంద్రబాబు ఇంటిపేరు నారా కంటే సారా బాగా నప్పుతుందని పేర్కొన్నారు. జగన్ ప్రసంగం అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.